Monday 29 April 2013

పెళ్లి మర్నాడే విడిపోయిన ఇంటర్నెట్ జంట


బికనీర్: ఇంటర్నెట్ ద్వారా ఒక్కటైన జంట, పెళ్లయిన మర్నాడే విడిపోయిన ఉదంతం రాజస్థాన్‌లో జరిగింది. బికనీర్ ప్రాంతానికి చెందిన శంకర్‌లాల్, సీమలకు ఒక వివాహ పరిచయ వెబ్‌సైట్ ద్వారా నెల్లాళ్ల కిందట పరిచయం ఏర్పడింది. బికనీర్ జిల్లాకు చెందిన శంకర్‌లాల్ అస్సాంలో వ్యాపారం చేస్తున్నాడు. సీమ తన కుటుంబ సభ్యులతో బికనీర్‌లోనే ఉంటోంది. ఇద్దరూ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ద్వారా రోజుల తరబడి చాటింగ్ కొనసాగించారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఈనెల 26న ఒక దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. అంతలోనే ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. సీమ తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె కుటుంబ సభ్యులు వరుడు శంకర్‌లాల్‌పై అత్యాచారం కేసు పెడతామని బెదిరించడంతో వివాదం మరింత ముదిరింది. దీంతో అతడు సీమ, ఆమె కుటుంబ సభ్యులు తనను మోసగించారంటూ డూంగేర్‌గఢ్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడు. అయితే, ఉభయ వర్గాలు రాజీకి రావడంతో అతడు 27న కేసు ఉపసంహరించుకున్నాడని పోలీస్‌స్టేషన్ అధికారి దినేశ్ మీనా తెలిపారు. తమ పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు వారిద్దరూ తమకు లిఖితపూర్వకంగా తెలిపారని చెప్పారు.

No comments:

Post a Comment